- శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం..
-
భయాందోళనలో స్థానికులు.. భక్తులు..

Cheetah Hulchul in Srisailam: శ్రీశైలం మహాక్షేత్రం మరోసారి చిరుత కలకలం సృష్టిస్తోంది.. ఈ మధ్య తరచూ చిరుతల సంచారంతో స్థానికులతో పాటు భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.. స్థానిక నీలం సంజీవరెడ్డి భవనం దిగువన ఉన్న గేటు వద్ద నిన్న రాత్రి చిరుత పులి సంచరించడం స్థానికంగా కలవరపెడుతుంది.. నిన్న రాత్రి నీలం సంజీవరెడ్డి భవన్ దిగువన గేటు ముందు చిరుతపులి నిలుచొని చూస్తున్న దృశ్యాలను కొందరు భక్తులు గమనించారు.. భక్తులు కారులో నుండి చూసి భయాందోళనకు గురయ్యారు. కారులోనే కూర్చొని చిరుతపులి గేటు ముందు ఉన్న దృశ్యాలను వారి సెల్ ఫోన్ లో చిత్రీకరించారు..
అయితే, కారు లైట్లు వేసి వీడియోస్ తీస్తుండగా కారు లైట్లు వెలుతురు పడటంతో చిరుతపులి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే, జన సంచారం చేసే ప్రాంతంలోకి చిరుతపులి రావడంతో ఒక్కసారిగా భక్తులు ఉలిక్కిపడ్డారు. తరచూ క్షేత్ర పరిధిలో ఎక్కడో ఒకచోట పలు ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తూనే ఉంది.. ఇక, ఈ విషయంపై అటవీశాఖ అధికారులు, దేవస్థానం అధికారులు స్పందించారు.. చిరుత పులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.. మరోపక్క అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉండడంతో చిరుతలు క్షేత్రం పరిధిలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ భక్తులకు, స్థానికులకు తారసపడడం పరిపాటిగా మారింది..