- తిరుపతిలో దారుణం..
-
జువైనల్ హోమ్ లో ఉండే బాలికపై అత్యాచారం..! -
నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోన్న బాధితురాలు..

Tirupati Crime: ఆడ పిల్లలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. పసికూనలు, బాలికలు, యువతులు. మహిళలు, వృద్ధురాలు.. ఇలా తేడా లేకుండా.. కామాంధులు వారి పశువాంఛను తీర్చుకుంటున్నారు.. తాజాగా, తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ బాలికల పరిశీలన గృహం(జువైనల్ హోమ్) లో ఉండే బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నగరంలో అనాథ బాలికలతో పాటు నేర చరిత్ర ఉన్న బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఉంది. ఈ వసతి గృహంలో ఉండే బాలికలు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గృహంలో ఉంటూ స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది.
అయితే, గతంలో ఈ బాలిక ఉన్న సత్యవేడులో హోమ్ వద్ద రిషి అనే యువకుడు ఈ నెల 21న నెహ్రూ మున్సిపల్ స్కూల్ వద్దకు వచ్చి స్టడీ అవర్లో బాలికపై అత్యాచారయత్నంకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఒంటిపై గాయాలతో సాయంత్రం హోమ్కి వెళ్లిన బాలికను తోటి విద్యార్థులతో పాటు సిబ్బంది ప్రశ్నించారు. దీంతో బాలిక జరిగిన విషయం తెలిపింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ నయోమి దాచిపెట్టారు. హోమ్ లో ఉండే డాక్టర్ బాలికల సంక్షేమ శాఖ అధికారులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారుల సూచనలతో జరిగిన ఘటనపై జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి.. బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.