- అమెరికాలో తెలుగు వైద్యుడిపై కాల్పులు..
-
దుండగుల కాల్పుల్లో వైద్యుడు పేరంశెట్టి రమేశ్ బాబు మృతి.. -
రమేశ్ బాబు స్వస్థలం తిరుపతి జిల్లా మేనకూరు.. -
అమెరికాలో పలు ఆస్పత్రులు నిర్మించి సేవలందిస్తున్న రమేష్ బాబు..

USA Gun Shooting: అమెరికాలో ప్రవాస తెలుగు వైద్యుడు పేరంశెట్టి రమేశ్బాబును శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన రమేశ్ బాబు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందో ఇప్పటి వరకు తెలియరాలేదు. డాక్టర్ రమేశ్బాబు అమెరికాలో పలుచోట్ల ఆసుపత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించారు అని సమాచారం. టస్కలూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నా.. రమేశ్బాబు సేవలకు గుర్తింపుగా అక్కడి వీధికి ఆయన పేరును కూడా పెట్టారు. అయితే, భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు తన ఇంట్లో రమేశ్ బాబు ఆతిథ్యం ఇచ్చేవారు.
అయితే, డాక్టర్ రమేశ్బాబు తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. జమైకాలో ఎమ్మెస్ పూర్తి చేసిన తర్వాత.. అమెరికాలోనే వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా డాక్టర్.. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.. అందరూ అక్కడే స్థిరపడ్డారు. రమేశ్బాబు కరోనా టైంలో విశేష సేవలందించి పలు పురస్కారాలను అందుకున్నారు. తాను చదువుకున్న ఉన్నత పాఠశాలకు గతంలో 14 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి రూ.20 లక్షలు డొనేషన్ చేశారు. ఈ నెల 15వ తేదీన నాయుడుపేటలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అంతలోనే చనిపోయారనే వార్త కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన తల్లి, తమ్ముడు తిరుపతిలో, సోదరి నాయుడుపేటలో నివాసం ఉంటున్నారు. వీరంతా అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.