- పీఆర్టీయూ యూనియన్ భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
- మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడి

Ram Mohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో పీఆర్టీయూ యూనియన్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. విద్యాశాఖను తీసుకొవద్దని నారా లోకేష్కు చాలా మంది సూచించారు.. కానీ మోజుతో కాదు ఛాలెంజ్గా తీసుకుని ఆయన విద్యా శాఖను నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, పిల్లల భవిష్యత్కు సానుకూల చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వం వచ్చింది, ఏంటి రెస్పాన్స్ లేదని ఉపాధ్యాయులకు అనిపించవచ్చు.. కానీ రాష్ర్టం పరిస్థితులు చూస్తే అర్థం అవుతుందన్నారు.
క్లాస్ రూంలో ఉంటే పరిస్థితులు తెలుస్తుందో లేదో కానీ, సచివాలయంలో కూర్చుంటే బాగోతం తెలుస్తుందన్నారు. చాలా పెద్ద ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు దృష్టిపెడుతున్నారని ఆయన చెప్పారు. కాస్త సమయం ఇస్తే జీవో 117 నుంచి ప్రతీ సమస్య పరిష్కరిస్తాంరని వెల్లడించారు. టీచర్స్కి అన్ని విధాలా గౌరవం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ర్ట అభివృద్దికి అంతా సహకరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. రానున్న రోజులలో శ్రీకాకుళం జిల్లాకి శాశ్వత కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. యువకుడినైన తాను కేంద్ర మంత్రి అయ్యానంటే సిక్కోలు ప్రజల చలవేనని స్పష్టం చేశారు.