- నేడు పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన..
-
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలకు మాజీ సీఎం.. -
వరద ఉద్ధృతితో అతలాకుతలమైన గ్రామాల పరిశీలన..

YS Jagan Pithapuram Tour: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలాకాలో నేడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు.. పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. ఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమైన గ్రామాల్లో పర్యటించనున్న వైసీపీ అధినేత.. బాధితులను పరామర్శించనున్నారు.. దీని కోసం ఈ రోజు ఉదయం 9.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు పిఠాపురం చేరుకుంటారు వైఎస్ జగన్.. అక్కడినుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం వెళ్లనున్న ఆయన.. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకుంటారు.. అక్కడినుంచి రమణక్కపేట వెళ్లనున్నారు.. అక్కడ బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి పిఠాపురం చేరుకుని మధ్యాహ్నం అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు..
అయితే, వైఎస్ జగన్.. పిఠాపురంలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది.. యు కొత్తపల్లి మండలం మాధవపురం, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాలలో ఏలేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించనున్నారు జగన్.. ఇప్పటికే విజయవాడలోని ముంపు ప్రాంతాల్లోనూ జగన్ పర్యటన కొనసాగింది.. వరదలు వస్తాయని తెలిసినా.. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో.. తరలించడంలో ప్రభుత్వం వైఫల్యం అయ్యిందని దుయ్యబట్టారు.. మరోవైపు.. సరైన రీతిలో సహాయక చర్యలు చేపట్టడంలోనూ కూటమి సర్కార్ విఫలం అయ్యిందని విమర్శించారు. అయితే, ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాకు వెళ్తున్నారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. ఎన్నికల ప్రచారంలో కూటమితో పాటు.. పవన్ కల్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి కామెంట్లు చేస్తారు అనేది చూడాలి..