Leading News Portal in Telugu

BC Janardhan Reddy: నితిన్‌ గడ్కరీతో మంత్రి జనార్దన్‌రెడ్డి భేటీ.. ఏపీకి అదనపు నిధులు..!


  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భేటీ..

  • జాతీయ రహదారులపై కేంద్ర మంత్రిత్వ సమీక్ష జరిపాం..

  • రహదారులకు ఉన్న అడ్డంకులు.. సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తాం..

  • CRF కింద మరింత అదనపు నిధులు ఇస్తామన్నారు..
BC Janardhan Reddy: నితిన్‌ గడ్కరీతో మంత్రి జనార్దన్‌రెడ్డి భేటీ.. ఏపీకి అదనపు నిధులు..!

BC Janardhan Reddy: కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి.. కేంద్ర సాయంపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. గతంలోనే ఏపీ రోడ్లపై విమర్శలు ఉండగా.. భారీ వర్షాలు, వరదలతో రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిన విషయం విదితమే.. ఇక, నితిన్‌ గడ్కరీతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. జాతీయ రహదారులపై కేంద్ర మంత్రిత్వ సమీక్ష జరిపాం అన్నారు.. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పనులకు ఉన్న భూ సేకరణ సహా అడ్డంకులపై చర్చించాం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, రహదారులకు ఉన్న అడ్డంకులు, సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం అని వివరించారు.. అయితే, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ CRF కింద మరింత అదనపు నిధులు ఇస్తామన్నారని వెల్లడించారు..

2014 నుంచి 2019 కాలంలో రోడ్ల విషయంలో ఎలాగైతే పరుగులు పెట్టించామో, ఇప్పుడు కూడా అలాగే పని చేస్తాం అన్నారు బీసీ జనార్దన్‌రెడ్డి.. గత ప్రభుత్వ అశ్రద్ధ వలన.. ఇచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టకపోవడం వల్ల పనులన్నీ ఆగిపోయాయని విమర్శించారు. నిలిచిపోయిన పనులు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, తదితర ప్రాజెక్టులపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తీసుకురమ్మని కేంద్రమంత్రి చెప్పారని వివరించారు.. త్వరలోనే DPRలు తీసుకొచ్చి కేంద్రమంత్రికి అందజేస్తాం.. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు రూ.156 కోట్లకు అంచనాలు వేశాం.. అవి త్వరలో ప్రారంభిస్తాం.. రోడ్లపై గుంతలు గత ప్రభుత్వ పాపాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి.. వాటిని కూడా త్వరగా మరమ్మత్తు చేసి పరిష్కరిస్తాం అని వెల్లడించారు ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాగా, గతంలో తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి.. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చించిన విషయం విదితమే..