Leading News Portal in Telugu

ఏపీ, తెలంగాణలపై ‘ధిక్కార’ పిటిషన్‌

హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల విభజన విషయంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ, ఏపీ ప్రభు త్వాలు అక్కడి విద్యుత్‌ సంస్థలు అమలు చేయడం లేదంటూ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలైంది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయడానికి వీల్లేదని, 2 నెలల్లో ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రస్తుతం ఉన్న జాయింట్‌ కమిటీని కొనసాగించడం గానీ లేదా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలన్న తీర్పును పట్టించుకోవడం లేదని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.దీనిని కోర్టు ధిక్కారం కింద పరిగణించాలంటూ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఇందులో విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఎస్‌పీడీసీఎల్‌ చైర్మన్, ఎండీ జి.రఘుమారెడ్డి, ఏపీ ఎస్‌పీడీసీఎల్‌ చైర్మన్‌ ఎండీ ఎంఎం.నాయక్, ఏపీ విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌లను ప్రతివాదులుగా పేర్కొ న్నారు. దీనిపై వచ్చే వారం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఉద్యోగుల విభజన చేయడాన్ని సవాల్‌ చేస్తూ పలువురు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి నేతృత్వం లోని ధర్మాసనం.. ఏపీ స్థానికత ఆధారంగా విభజన చెల్లదంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 2న తీర్పునిచ్చింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రస్తుతం ఉన్న జాయింట్‌ కమిటీని కొనసాగించడం గానీ లేదా కొత్త కమిటీని, కమిటీలను ఏర్పాటు చేయడంగానీ చేయాలని రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ విద్యుత్‌ సంస్థ లు, ఏపీ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలంది.

ఈ జాయింట్‌ కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజనను 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. విభజన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇప్పటికే రిలీవ్‌ చేసిన ఉద్యోగులను ఇతర ఉద్యోగులతో సమానంగా.. వివక్షకు తావు లేకుండా కొనసాగించాలని విద్యుత్‌ సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో టీఎస్‌ఎస్‌పీడీసీ ఎల్‌ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.