విజయవాడలో కఠిన ఆంక్షలు.. ఆ మూడు గంటలే రోడ్ల మీదకు.
విజయవాడలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నగర మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. కరోనా వైరస్ భారీగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఆ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ప్రజలకు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే రోడ్ల మీదకు అనుమతి ఇస్తామని అన్నారు. పచారి షాపులు, పండ్ల మార్కెట్, రైతు బజార్లు, కాళేశ్వరరావు మార్కెట్కి మాత్రమే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరుకు తెరిచి ఉంటాయని చెప్పారు. ఉదయం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పాలు, డెయిరీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు.
ఇక ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఏటీఎం ఫిల్లింగ్ వెహికిల్స్కు అనుమతి ఇస్తామని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు టెక్ అవే హోటల్స్కు అనుమతి ఉంటుందని మునిసిపల్ కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, రెవిన్యూ, వీయంసీ, మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంటు వెహికల్స్కు మాత్రమే అన్ని వేళ్లలో అనుమతి ఇస్తామని వెల్లడించారు. ఇక.. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్కు, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్కు ప్రత్యేక అనుమతి ఉంటుందని చెప్పారు.
అటు.. జువెల్లరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్, క్లాత్ స్టోర్స్, ఫ్యాన్సీ షాప్స్, హార్డ్వేర్, ఫర్నిచర్, బేకరీస్ & ఐస్క్రీమ్ పార్లర్స్, రెడిమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఐరన్ & స్టీల్ షాప్స్, గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్, పిజ్జా కాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్కు లాక్డౌన్ పూర్తయ్యే వరకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆటోనగర్ కూడా లాక్ డౌన్ అమలు చేస్తుందని అన్నారు. ఇక, ప్రజలు గుమిగుడినా, నిబంధనలను అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.