ఏపీలోని ఆ ప్రాంతాల్లో ర్యాండమ్ టెస్టులు… సీఎం జగన్ ఆదేశం
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్కు పరీక్షలు పూర్తయిన తర్వాత ఎవరెవరికి పరీక్షలు నిర్వహించాలన్న దానిపై అధికారులు, మంత్రులతో జరిగిన సమీక్షలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చించారు. హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్ టెస్టులపై దృష్టిపెట్టాలని… వైజాగ్లో నిర్వహించిన పద్ధతిలో ర్యాండమ్ టెస్టులు జరగాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వేద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు సీఎం జగన్కు వివరించారు.
రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సోమవారం సాయంత్రం 6 గంటనుంచి మంగళవారం ఉదయం వరకూ 150 కోవిడ్ నిర్దారణా పరీక్షలు నిర్వహించామని… ఇందులో ఒకే పాజిటివ్ కేసు వచ్చిందని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించిన అధికారులు… క్రమంగా కేసులు సంఖ్య తగ్గవచ్చని వివరించారు. ఉదయం 9 గంటలవరకూ మొత్తం 304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయయని… ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు చేపట్టామని… ఇందులో 196 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టుల్లో 280 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని అన్నారు. మరోవైపు క్వారంటైన్లు, క్యాంపుల్లో ఉన్న సదుపాయాలు, వసతులను పెంచడానికి ప్రధానంగా దృష్టిపెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. క్రిటికల్ కేర్ కోసం నిర్దేశించిన కోవిడ్ ఆస్పత్రులు, అలాగే జిల్లాల వారీగా నిర్దేశించుకున్న కోవిడ్ ఆస్పత్రుల సన్నద్ధతపైనా దృష్టిపెట్టాలని అన్నారు. ఈ ఆస్పత్రుల్లో సదుపాయాల్లో నాణ్యత ఉండాలని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం నాటికి అనుకున్న ప్రమాణాల ప్రకారం వీటన్నింటిలోనూ వసతులు ఏర్పాటు చేస్తామని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.