వైఫల్యాల గురించి అప్పుడు మాట్లాడతా… పవన్ కళ్యాణ్
కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతో పాటు, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అయిందని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వారికి జనసేన పార్టీ అండగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. లాక్ డౌన్ మీద ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరగడం, రోజువారీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను నేతలు పవన్ కళ్యాన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘కరోనా వైరస్ విస్త్రతి ఉన్న విపత్కర తరుణం ఇది. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలి. లాక్ డౌన్ తర్వాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదాం. పేద కుటుంబాలకు రూ.1000 పంపిణీ చేసిన తీరు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫఉన నిలబడిన అభ్యర్థుల ద్వారా పంపిణీ చేయడంపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేయాలి.’ అని పవన్ కళ్యాన్ అన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే, వైద్యులకు పీపీఈలు, మాస్క్లు తప్పనిసరిగా అందివ్వాలని కోరానన్నారు.