Leading News Portal in Telugu

ఏపీలోని ఆ జిల్లాపై కేంద్రం ప్రత్యేక దృష్టి… ఎందుకంటే…

దేశంలోని మిగతా రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ కరోనా కేసులో పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఇదే పనిలో నిమగ్నమైంది. ఇదిలా ఉంటే ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే దీనిపై కేంద్రం ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. జిల్లాలో కరోనా లేకపోవడమే మంచిదే అయినా… ఎక్కడైనా ఇంతవరకు గుర్తించని పరిస్థితులు ఉన్నాయా ? అనే కోణంలో కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అటువంటి కేసులను గుర్తించేందుకు జిల్లా అంతటా జల్లెడ పట్టాల్సిందేనని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులను గురువారం ఆదేశించింది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎవరైనా అనారోగ్య కారణాలతో చేరితే… అటువంటి వారిని మరోసారి పరిశీలించాలని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన పరీక్షలు చేయాలని సూచించింది. దీని కోసం ప్రత్యేకంగా ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను నియమించారు. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా కేసులను గుర్తించేందుకు జల్లెడ పట్టే కార్యక్రమానికి ఈ బృందం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కిమ్స్‌ ఆసుపత్రి, రాగోలులోని జెమ్స్‌, గుజరాతీపేటలో గల ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను సందర్శించింది. అక్కడి వైద్యులు, సిబ్బందితో పాటు రోగులతో చర్చించి వివరాలు సేకరించింది. వాస్తవంగా కరోనా కేసులు లేకపోవడానికి కారణాలను కూడా బృంద సభ్యులు సేకరించనున్నారు.