Leading News Portal in Telugu

లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్.. మిగిలిన వారికి భిన్నంగా..

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్ డౌన్‌ను పొడిగించాలా? వద్దా? అనే అంశంపై మెజారిటీ సీఎంలు కొనసాగించాలని కోరుతున్న వేళ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి లాక్ డౌన్‌ను రెడ్ జోన్లకే పరిమితం చేయాలని చెప్పారు. ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ మాట్లాడుతూ… ‘రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించాం. కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోంది. సామాన్యులపై, రాష్ట్రంపై లాక్‌డౌన్‌ ప్రభావానికి సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నా. జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాథికల్పనలో 62శాతం వాటా వ్యవసాయానిదే. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వచేయడానికి సరిపడా గోదాములు లేవు. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి. కోవిడ్‌–19 నివారణకు ప్రధాని మంత్రిగా మీరు తీసుకున్న విశాలపరమైన, గట్టి చర్యలను నేను బలంగా సమర్థిస్తున్నా. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు కదలాలన్నది నా అభిప్రాయం. ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలి. ఏపీలో 676 మండలాలు ఉన్నాయి. 676 మండలాల్లో 81 మండలాలు రెడ్‌జోన్, ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. 595 మండలాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయి, ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదు. రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేయాలన్నది నా అభిప్రాయం.’ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనామందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి (లాక్ డౌన్‌) కొనసాగాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలన్నది తన అభిప్రాయంగా చెప్పారు. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఒక్కటిగా ఉండాలి, ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలని సీఎం జగన్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం మీద సంపూర్ణ విశ్వాసం ఉందని, ప్రధానిగా మోదీ సూచించే వ్యూహంతో ముందుకు సాగుతామని జగన్ స్పష్టం చేశారు.