టీడీపీ ఎంపీ, నేతల ఫోర్జరీ… డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ….
తెలుగుదేశం పార్టీ నేతలు ఫోర్జరీ చేశారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతకాన్ని టీడీపీ ఆఫీసులోనే ఫోర్జరీ చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ దానిపై విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్కు రాసిన లేఖలో విజయసాయిరెడ్డి కోరారు. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ రమేష్ కుమార్ లేఖ రాసినట్టుగా బయటకు వచ్చిన ఓ లేఖ రాజకీయంగా పెను దుమారాన్ని సృష్టించింది. ఈ లేఖపై విచారణ జరపాలని విజయసాయిరెడ్డి కోరారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లు అని నమ్ముతున్నా. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్బంగా చేసిన సంతకానికి, ఈ లేఖలో ఉన్న సంతకానికి మధ్య తేడా ఉంది. ఈ పోర్జరీ సంతకం చేసిన లెటర్ టీడీపీ ఆఫీసులోనే తయారైందని సమాచారం ఉంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ ఈ లేఖను సృష్టించారు. ఈ తతంగమంతా గత ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్కు తెలిసే జరిగింది. ఈ ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై విచారణ చేయాలి. ఈ లేఖను పోరెన్సిక్ ల్యాబ్కు పంపాలి. వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించాలి.’ అని విజయసాయిరెడ్డి డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.