కరోనా కాలంలో వైసీపీ బలవంతపు వసూళ్లు… సీఎం జగన్కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రజలు అల్లాడుతుంటే, వైసీపీ నేతలు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి పేదలు, పంట అమ్ముడుపోక రైతులు, వ్యాపారాలు దెబ్బతిని వర్తకులు, పారిశ్రామికవేత్తలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే… సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇమ్మంటూ కొందరు వైసీపీ నేతలు బలవంతపు వసూళ్ళకు దిగడం దారుణం. విరాళం అంటే స్వచ్ఛందంగా ఇచ్చేది, భయంతో ఇచ్చేది కాదు.’ అని చంద్రబాబు రాసిన లేఖలో ఆక్షేపించారు. సహాయకచర్యల్లో కూడా వైసీపీ నాయకులు రాజకీయాలు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ‘రూ.1000 నగదు, నిత్యావసరాల పంపిణీలను వైసీపీ నేతలు భౌతిక దూరం పాటించకుండా గుంపుగా తిరుగుతూ స్థానిక ఎన్నికల అభ్యర్థుల చేతుల మీదుగా పంచడం ఏంటి పార్టీలకు అతీతంగా అందించాల్సిన సాయం కొందరికే ఇవ్వడం ఏంటి?’ అని చంద్రబాబు రాసిన లేఖలో ప్రశ్నించారు.
కరోనా పై సరైన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వకుండా హెల్త్ బులెటిన్ ఒకలా, రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ఒకలా, డ్యాష్ బోర్డులో ఒకలా చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘అబద్ధాలతో ఇటు ప్రజలను, అటు కేంద్రప్రభుత్వాన్నీ ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? మీ నిర్వాకాలవల్లే కరోనా ప్రబలిపోతోంది.’ అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రపంచంలోని పాలకులందరూ కరోనాతో యుద్ధం చేస్తూ, ప్రజలను ఆదుకుంటూ, వారిలో భరోసా పెంచడానికి కృషిచేస్తుంటే… మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలపైనే దృష్టిపెట్టిందంటూ విమర్శలు గుప్పించారు. ఇకనైనా ప్రభుత్వం ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించే ప్రయత్నం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.