Leading News Portal in Telugu

విశాఖలో కరోనా కేసులపై కలెక్టర్ వివరణ

విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు దాస్తున్నారని వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పందించారు. ఇలాంటి ఆరోపణలు అబద్దమని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులని దాచాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక కేసు దాచినా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకే విశాఖలోని కేజీహెచ్‌లో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయన్న కలెక్టర్ వినయ్ చంద్… వారిలో 13 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మిగిలిన వారు కూడా కోలుకుంటున్నారని వెల్లడించారు.

పకడ్బందీ చర్యల కారణంగానే కరోనా కేసులు నియంత్రించగలిగామని అన్నారు. మార్చి 18న వచ్చిన తొలి కేసుతో తామంతా పూర్తిస్ధాయి చర్యలతో కరోనా నియంత్రణపై ప్రణాళికాబద్దంగా వ్యవహరించామని తిపారు. కరోనా నియంత్రణకి ఐఏఎస్ అధికారులు, సీనియర్ అధికారులతో 22 కమిటీలు నియమించామని చెప్పారు. 3 వేల‌ మందికి పైగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి హోం క్వారంటైన్లో ఉంచామని వినయ్ చంద్ తెలిపారు.

అనుమానం వచ్చిన వారి శాంపిల్స్ సేకరించామని, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కి అనుసంధానంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. రెండు షిఫ్టులలో 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు క్షేత్రస్దాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతీ టీమ్‌లో సీనియర్ వైద్యులు, వాలంటీర్లు, జీవీఎంసీ ప్లానింగ్ సిబ్బంది ఉంటారని, కరోనా నియంత్రణలో జిల్లా యంత్రాంగానికి వాలంటీర్ల పనితీరు మరింతగా ఉపయోగపడిందన్నారు. విశాఖలో మూడో విడత ఇంటింటి సర్వే పూర్తయిందని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ప్రభుత్వం వాదన ఇలా ఉంటే… విశాఖలో కరోనా కేసులు దాచిపెడుతున్నారని కొంతకాలంగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.