Leading News Portal in Telugu

అందుకే నిమ్మగడ్డ తొలగింపు… హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్

నిమ్మగడ్డ రమేశ్‌ను కావాలనే ఏపీ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పించలేదని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి తుది అఫిడవిట్‌ను ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించామని అఫిడవిట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రిటైడ్ జడ్జీలను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా రూపొందించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

ఈ క్రమంలోనే మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఈసీల కాల పరిమితి వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 జిల్లాల్లో జరిగిన ఎన్నికల హింసకు సంబంధించిన వివరాలను సైతం కోర్టుకు వివరించింది. 2014లో 221 హింసాత్మక ఘటనలు జరిగితే 2020లో 88 ఘటనలు జరిగినట్టు వెల్లడించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని అఫిడవిట్‌లో పేర్కొంది. పోలీసులు, పరిపాలన యంత్రాంగంపై నిమ్మగడ్డ చేసిన ఆరోపణలు కూడా అఫిడవిట్‌లో పేర్కొంది. తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారనే నిమ్మగడ్డ వేసిన పిటిషన్ అవాస్తవమని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది.