Leading News Portal in Telugu

సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ… వారికి రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల ఆర్థిక సహాయం, చంద్రన్న బీమాను పునరుద్ధరించటంతో పాటు వారి జీవన భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఈ ఏడాది ఇసుక సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజా లాక్ డౌన్ వల్ల పుట గడవని దుర్భర జీవితం గడుపుతున్నారు. నూతన ఇసుక విధానం వలన ఉపాధి లేక, కుటుంబాలను పోషించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో కలచి వేసింది. ఇప్పుడు లాక్ డౌన్ వారిని మరింత దెబ్బతీసింది. కార్మికులకు అందుబాటులో ఉన్న రూ. 1900 కోట్ల బిల్డింగ్ సెస్ వారి సంక్షేమానికే ఖర్చు చేయాలి.’ అని నారా లోకేష్ తన లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. నారా లోకేష్ మరో లేఖను రాశారు. రాష్ట్రంలో 3.5 లక్షల మంది చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. 81 వేల పవర్ లూమ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి చేనేత కుటుంబానికి రూ.15వేల ఆర్థిక సాయం చేయాలని కోరారు.