Leading News Portal in Telugu

సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. అధికారుల సమావేశంలో ఈ విషయాన్ని సీఎం జగన్ తెలియజేశారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి సడలింపులు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే, కేంద్రం ఇచ్చిన నిబంధనలు కచ్చితంగా అమలు జరుపుతున్నారా? లేదా? అని వివరాలు అడిగారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ అమిత్ షాకు వివరించారు. రాష్ట్రంలో విస్త్రతంగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని తెలియజేశారు. ప్రతి మిలియన్‌ జనాభాకు 1274 చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆ రకంగా అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని తెలిపారు.

గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను రాష్ట్రానికి రప్పించే విషయంపై కూడా చర్చ జరిగింది. గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను తెప్పించడంపై ఇప్పటికే తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కోవిడ్‌–19 నివారణా చర్యలకోసం రాష్ట్రానికి కేంద్రం తరఫున నోడల్‌ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు సీఎం జగన్‌ అమిత్ షాకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ అధికారి సతీష్‌ చంద్ర చూసుకుంటారంటూ తాను కేంద్ర మంత్రికి తెలియజేశానని, ఆమేరకు ఆమె∙కార్యాలయం నుంచి కూడా ఒక అధికారిని అప్పగించారని తెలిపారు. ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి.. తెలుగు మత్స్యకారులను గుజరాత్‌ నుంచి ఏపీకి తీసుకు వచ్చేందుకు తగిన ప్రయత్నాలు చేస్తానంటూ నిర్మలా సీతారామన్‌ చెప్పారని సీఎం జగన్ తెలియజేశారు. సముద్రమార్గం ద్వారా తీసుకురావడానికి ప్రయాణికుల నౌకకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖనుంచి, సంబంధిత విభాగాలనుంచి అనుమతులు రావాల్సిన అవసరం ఉందని, దీనికి చాలా సమయం పడుతుందని అధికారులు నివేదించిన నేపథ్యంలో ఈ ప్రయత్నాలు చేసినట్టు సీఎం జగన్ తెలిపారు.