లాక్ డౌన్ ఎత్తివేతపై సీఎం జగన్ పరోక్ష సంకేతాలు…
మే 3 తరువాత దేశంలో, రాష్ట్రంలోలాక్ డౌన్ ఎత్తేస్తారా ? ఈ అంశంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంది ? ఆయన ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోదీతో ఏం చెప్పారు ? ఇలాంటి అంశంపై ఆసక్తి నెలకొన్న సమయంలోనే… సీఎం జగన్ మీడియా ముందుకు వచ్చారు. ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్లో తాను ఏం మాట్లాడాననే విషయాన్ని ప్రస్తావించకపోయినా… రాష్ట్రంలోని కరోనా రహిత మండలాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనాల్సిన పరిస్థితి ఉందని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. గతంలోనే కరోనా లేని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలకు అనుమతించాలని, లాక్ డౌన్ మినహాయింపు ఇవ్వాలని కోరిన సీఎం జగన్… గ్రీన్ జోన్లలో సాధారణ పరిస్థితులు నెలకొనాల్సిన పరిస్థితులను మరోసారి ప్రస్తావించారు.
రాష్ట్రంలో మొత్తం 676 మండలాల్లో 559 మండలాలు గ్రీన్ జోన్లో ఉన్నాయని తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్… ఆ గ్రీన్ జోన్లలో సాధారణ కార్యకలాపాలు జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. గ్రీన్ జోన్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజారవాణాపై మరికొంతకాలం నిషేధం కొనసాగుతుందని పరోక్షంగా తెలిపారు. గ్రీన్ జోన్లలో పరిశ్రమలు కూడా నడుస్తాయని సీఎం జగన్ అన్నారు. గ్రీన్ జోన్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన వారి పట్ల వివక్ష వద్దని సీఎం అన్నారు.