Leading News Portal in Telugu

7th Pay Commission: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రెండేళ్ల పాటు జీతంతో కూడిన సెలవు


7th Pay Commission: ఆల్ ఇండియా సర్వీస్ (ఏఐఎస్)లో అర్హులైన సభ్యులకు సెలవులకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. దీని ప్రకారం ఇప్పుడు ఈ ఉద్యోగులు వారి కెరీర్‌ మొత్తంలో రెండు సంవత్సరాల వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వం గరిష్టంగా రెండేళ్ల వరకు ఈ సెలవును ఇస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) తాజాగా కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ జూలై 28న విడుదలైంది. దీని కింద ఆల్ ఇండియా సర్వీస్ చిల్డ్రన్ లీవ్ రూల్ 1995ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి సవరించింది. ఏఐఎస్ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ప్రకారం వేతనాలు అందుతాయి.

ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు 730 రోజుల సెలవు
ఇద్దరు పెద్ద పిల్లలను చూసుకోవడానికి ఆల్ ఇండియా సర్వీసెస్ (ఏఐఎస్)లోని ఒక స్త్రీ లేదా పురుష సభ్యునికి మొత్తం సర్వీస్ సమయంలో 730 రోజుల సెలవు ఇవ్వబడుతుంది. పిల్లల పెంపకం, విద్య, అనారోగ్యం, సంరక్షణ వంటి కారణాలతో 18 సంవత్సరాలు పూర్తికాకముందే ఈ సెలవు మంజూరు చేయబడుతుంది. చైల్డ్ కేర్ లీవ్ కింద మొత్తం సర్వీస్ సమయంలో సభ్యునికి మొదటి 365 రోజుల సెలవులకు 100శాతం జీతం చెల్లించబడుతుంది. మరోవైపు, రెండవ 365 రోజుల సెలవులో 80 శాతం జీతం చెల్లించబడుతుంది.

క్యాలెండర్‌లో మూడు సెలవులు మాత్రమే
ఒక క్యాలెండర్ సంవత్సరంలో ప్రభుత్వం మూడు సెలవులకు మించి ఇవ్వదు. మరోవైపు, ఒంటరి మహిళ విషయంలో అకాడిమిక్ క్యాలెండర్ లో 6 సార్లు సెలవు ఆమోదించబడుతుంది. చిల్డ్రన్ కేర్ లీవ్ కింద స్పెల్‌లో ఐదు రోజుల సెలవు ఇవ్వబడుతుంది.

సెలవుల కోసం ప్రత్యేక ఖాతా
నోటిఫికేషన్ ప్రకారం.. చిల్డ్రన్ లీవ్ అకౌంట్ ఇతర లీవ్‌లతో కలపబడదు. దీనికి ఒక ప్రత్యేక ఖాతా ఉంటుంది. ఇది సభ్యులకు విడిగా ఇవ్వబడుతుంది. పిల్లల సెలవు సంరక్షణ ప్రయోజనం ప్రొబేషన్ వ్యవధిలో ఉద్యోగులకు అందించబడదు.