Leading News Portal in Telugu

Delhi Govt: కొత్త సీసాలో పాత మందు.. కోట్లు సంపాదించిన ఢిల్లీ ప్రభుత్వం


Delhi Govt: కొత్త సీసాలో ‘పాత మద్యం’… అవును.. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన గత ఏడాది లెక్కలు చూస్తే ఈ ప్రకటన సరిగ్గా సరిపోతుంది. గత సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని మద్యం మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. అంతే కాకుండా దానిపై చాలా రాజకీయ ప్రకంపనలు కూడా రేగాయి. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబరు 1, 2022 నుండి ‘పాత మద్యం విధానాన్ని’ అమలు చేసింది. ఇప్పుడు దీని కారణంగా ఆదాయాలు, అమ్మకాలలో ‘కొత్త రికార్డు’ సృష్టించబడింది. ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2022, ఆగస్టు 31, 2023 మధ్య 61 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను విక్రయించింది. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలు, కాంట్రాక్టుల విక్రయాల్లోనూ ఇదే సరికొత్త రికార్డు.

ఢిల్లీ ప్రభుత్వం కేవలం మద్యం విక్రయాల్లో రికార్డు సృష్టించలేదు. దానినుంచి భారీగా ఆదాయం కూడా వచ్చింది. మద్యం విక్రయాల ద్వారా ఢిల్లీ ప్రభుత్వం ఏడాదిలో రూ.7,285.15 కోట్లు ఆర్జించింది. దీనిపై ప్రభుత్వ విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వసూళ్లు కూడా రూ.2,013.44 కోట్లు. ఇంతకు ముందు కొత్త మద్యం పాలసీ అమలులో ఉన్నప్పుడు 2021-22లో ప్రభుత్వ ఆదాయం రూ.5,487.58 కోట్లు. కొత్త విధానంలో మద్యం రిటైల్ అమ్మకానికి ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలకు లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా సిఫారసు మేరకు సీబీఐ అక్రమాలపై విచారణ జరిపింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియాను కూడా అరెస్టు చేశారు.

కొత్త ఎక్సైజ్ పాలసీపై దుమారం రేగడంతో ఢిల్లీ ప్రభుత్వం పాత విధానాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత మద్యం దుకాణాలు, కాంట్రాక్టుల నిర్వహణ బాధ్యతను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన 4 పీఎస్‌యూలకు అప్పగించారు. ఇప్పుడు ఢిల్లీలో, ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఢిల్లీ కన్స్యూమర్ కో-ఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్, ఢిల్లీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నగరంలో 600 మద్యం దుకాణాలను నడుపుతున్నాయి.