Leading News Portal in Telugu

Cement Prices: పెరుగుతున్న సిమెంట్ ధరలు.. విలవిలలాడుతున్న సామాన్యుడు


Cement Prices: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి చేదువార్త. కొన్ని నెలల ఉపశమనం తర్వాత సిమెంట్ ధరలు మరోసారి పెరగడం ప్రారంభించాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో సిమెంట్ ధరలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. దీంతో ఇంటి నిర్మాణ వ్యయం కూడా నానాటికీ పెరిగిపోయింది. రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా. బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విశ్లేషణ ప్రకారం.. సెప్టెంబర్ నెలలో సిమెంట్ సగటు ధరలు ఒక నెల క్రితం అంటే ఆగస్టుతో పోలిస్తే 4 శాతం పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో సిమెంట్ ధర మునుపటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్-జూన్ 2023 సగటు ధర కంటే 0.5 శాతం నుండి 1 శాతం ఎక్కువగా ఉంది.

జెఫరీస్ ఇండియా విశ్లేషకులు సిమెంట్ ధరలు పెరగడానికి తూర్పు భారతదేశంలో సిమెంట్ ధరల పెరుగుదల కారణంగా భావిస్తున్నారు. పెరిగిన ధరల భారాన్ని మోయడానికి బదులు సిమెంట్ కంపెనీలు ఇప్పుడు వినియోగదారులపై భారం మోపుతున్నాయి. ఇంధన వ్యయం సిమెంట్ కంపెనీల ఖర్చులను పెంచింది. దీని ప్రభావం తగ్గించేందుకు సిమెంట్ రిటైల్ ధరలను పెంచుతున్నారు. తూర్పు భారతదేశంలో సిమెంట్ ధరలు ఎక్కువగా పెరిగాయి. ఆగస్టు నెలాఖరులో ఉన్న సిమెంట్ ధరలు సెప్టెంబర్ చివరి నాటికి బస్తాకు రూ.50 నుంచి 55 వరకు పెరిగాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో సిమెంట్ ధర చాలా తక్కువగా పెరిగింది. ఈ సమయంలో మిగతా ప్రాంతాల్లో బస్తా ధర రూ.20 పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం వరకు సిమెంట్ ధర బాగా తగ్గింది. దీర్ఘకాలికంగా ధర ఇంకా తక్కువగానే ఉంది. జూలై నెలలో సిమెంట్ చాలా చౌకగా మారింది. అయితే, గత రెండు నెలల నుండి బుల్లిష్ ట్రెండ్ తిరిగి వచ్చింది. రాబోయే నెలల్లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యయంపై దృష్టి పెట్టడం వల్ల ఈ రంగంలో డిమాండ్ దృశ్యం బలంగా ఉంది. ప్రస్తుతానికి ఖర్చు తగ్గే అవకాశం లేదు.