ఈ సమయంలో ఇలాంటివా: సొంత ఉద్యోగులకు SBI గట్టి వార్నింగ్
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూడు వారాల లాక్ డౌన్కు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. మరో పది రోజులు మిగిలి ఉంది. ఈ సమయంలో ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ కార్యకలాపాలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ సొంత బ్యాంకుకు చెందిన ఉద్యోగులే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిని బ్యాంకు తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది.
సోషల్ మీడియాలో ఉద్యోగులు ఎవరైనా అతిగా చేస్తే వారిపై చర్యలు తప్పవని ఈ దిగ్గజ బ్యాంకు హెచ్చరించింది. ఆయా సర్కిల్స్లోని బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్లు అందరికీ లేఖలు అందాయి. ఇటీవల కొందరు ఉద్యోగులు సోషల్ మీడియాలో బ్యాంకు విధానాలు, మేనేజ్మెంట్, శాఖల పని తీరుపై విమర్శలు పోస్ట్ చేస్తుండడంతో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలనుకుంటున్నట్లు బ్యాంకు స్పష్ట ంచేసింది. బ్యాంకు ప్రతిష్టకు భంగం వాటిల్లేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది.