Leading News Portal in Telugu

SBI: కరోనా వైరస్ సోకిందని బ్యాంకుకు తాళం వేసిన ఎస్‌బీఐ ఉద్యోగులు

కరోనా వైరస్ సోకిందని ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్‌ను మూసేసిన ఘటన ఒడిషాలోని నబరంగ్‌పూర్ జిల్లా మోకియాలో కలకలం రేపింది. బ్యాంకు సిబ్బంది అందరూ కోవిడ్-19 పేషెంట్‌‌తో కాంటాక్ట్ అయ్యారని, వారంతా 14 రోజులు క్వారెంటైన్‌కు వెళ్లినందున బ్రాంచ్ మూసేస్తున్నామని ఎస్‌బీఐ మేనేజర్ నోటీసు అతికించారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ బ్రాంచ్ మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తమ దృష్టికి తీసుకురాలేదని, అసలు జిల్లాలోనే ఒక్క పాజిటీవ్ కేసు కూడా లేదని, ఎలాంటి టెస్టులు చేయించుకోకుండా బ్యాంకు సిబ్బంది తమకు తామే కరోనా సోకిందని ఎలా చెప్పుకుంటారని మండిపడ్డారు. వెంటనే బ్రాంచ్‌ను తెరవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఎస్‌బీఐ మోకియా బ్రాంచ్ క్లర్క్ మిశ్రా ఏప్రిల్ 4న ఓ వ్యక్తికి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. తన బైక్‌పై ప్రయాణించిన వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చినట్టు తెలుసుకొని తనకు కరోనా వైరస్ సోకిందని భయపడ్డాడు. నబరంగ్‌పూర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లి కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అయినట్టు చెప్పాడు. ఆ సమయంలో మిశ్రా భయంతో ఉండటం వల్ల హై బీపీకి గురైనట్టు డాక్టర్లు గుర్తించారు. మరుసటి రోజు కూడా ఆస్పత్రికి వెళ్లి తనకు జ్వరంగా ఉందని చెప్పాడు. కోవిడ్ 19 లక్షణాలు లేకపోవడంతో డాక్టర్లు ప్యారాసిటమోల్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఏప్రిల్ 6న బ్యాంకుకు వెళ్లిన క్లర్క్ తనకు కరోనా వైరస్ సోకిందని, బ్రాంచ్‌లో అందరికీ ఈ వైరస్ సోకి ఉండొచ్చని చెప్పాడు. నిజానిజాలేంటో తెలుసుకోకుండా బ్రాంచ్ మేనేజర్ వెంటనే బ్యాంకును మూసేయించారు. చివరకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో బ్యాంకు తెరుచుకుంది.