Savings: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి స్కీమ్స్లో మారిన రూల్స్ ఇవే
మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF అకౌంట్ ఉందా? సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో డబ్బులు దాచుకుంటున్నారా? ఈ పథకాల రూల్స్ మారాయి. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా ఈ పథకాలకు సంబంధించిన కొన్ని నియమనిబంధనల్ని సడలించింది కేంద్ర ప్రభుత్వం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులు ఎప్పట్లాగే డబ్బులు జమ చేయొచ్చు. కానీ లాక్డౌన్ కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో డబ్బుల జమ చేయలేని వారికి నియమనిబంధనల్ని సవరించింది కేంద్రం. సాధారణంగా 2020 మార్చి 31 లోగా ఆ ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి కూడా డబ్బులు జమ చేయకపోతే అకౌంట్లు ఇనాక్టీవ్ అవుతాయి. జరిమానా, రివైవల్ ఫీజు చెల్లిస్తేనే అకౌంట్ యాక్టీవ్ అవుతుంది. అయితే 2020 మార్చి 31 గా ఉన్న చివరి తేదీని 2020 జూన్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.
ఇక 2020 మార్చి 31 నాటికి ఎవరి పీపీఎఫ్ అకౌంట్స్ అయినా మెచ్యూర్ అయితే ఆ అకౌంట్ను 2020 జూన్ 30 వరకు పొడిగించుకోవచ్చు. ఇందుకోసం పీపీఎఫ్ సబ్స్క్రైబర్లు దరఖాస్తు ఫామ్పై సంతకం చేసి రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి పంపాలి. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒరిజినల్ కాపీని సబ్మిట్ చేయాలి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షలు మాత్రమే సేవింగ్స్ చేయాలి. ఒకవేళ అంతకన్నా ఎక్కువ జమ చేసినట్టైతే ఎంత ఎక్కువ జమ చేస్తే అంత తిరిగి వడ్డీ లేకుండా ఇచ్చేస్తాయి బ్యాంకులు. ఖాతాదారులు 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరుగా డబ్బులు జమ చేయాలి.