Leading News Portal in Telugu

Jan Dhan Account: మీ జన్ ధన్ అకౌంట్‌లో డబ్బులు సేఫ్… ఆర్థిక మంత్రి క్లారిటీ

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ స్కీమ్‌లో భాగంగా 20.5 కోట్ల మంది మహిళల జన్ ధన్ అకౌంట్లలోకి మొదటి విడత రూ.500 ట్రాన్స్‌ఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డబ్బుల్ని వెంటనే డ్రా చేసుకోకపోతే తిరిగి వెళ్లిపోతాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. మహిళల జన్ ధన్ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బులు సురక్షితంగానే ఉన్నాయని, అకౌంట్ హోల్డర్లు ఎప్పుడైనా ఆ డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చని నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. వాటిని వెంటనే డ్రా చేయకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకోదని స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా 20.5 కోట్ల మంది మహిళల అకౌంట్లలోకి నెలకు రూ.500 చొప్పున మూడు నెలలు ఇస్తామని ప్రకటించింది కేంద్రం. అందులో భాగంగా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 వరకు లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బుల్ని జమ చేశాయి బ్యాంకులు. అయితే ఈ డబ్బుల్ని డ్రా చేసుకోకపోతే వెనక్కి వెళ్తాయన్న ప్రచారంతో లబ్ధిదారులు ఏటీఎంలు, బ్యాంకులకు క్యూకట్టారు. నిజంగానే డబ్బులు వెనక్కి వెళ్తాయని భావించారు. దీంతో ఈ పుకార్లపై కేంద్రమే క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా వివిధ వర్గాలకు కూడా పలు బెనిఫిట్స్‌ని ప్రకటించింది.