SBI: ఏటీఎం కార్డులు ఉన్నవారికి ఎస్బీఐ గుడ్ న్యూస్
మీరు ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుంటారా? కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఎక్కువసార్లు ఏటీఎంకు వెళ్లాల్సి వస్తుందా? ఎక్కువసార్లు డబ్బులు డ్రా చేస్తే ఏటీఎం సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి వస్తుందనుకుంటున్నారా? మీలాంటివారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI శుభవార్త చెప్పింది. ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత వసూలు చేసే ఏటీఎం సర్వీస్ ఛార్జీలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. అంటే మీరు ఎస్బీఐ ఏటీఎం కార్డుతో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఏ కార్డుకైనా ఇది వర్తిస్తుంది. లిమిట్ లేనట్టే. లాక్డౌన్ కారణంగా ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ ఏటీఎంలు మాత్రమే కాదు, ఇతర బ్యాంకుల ఏటీఎంలో డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవు. 2020 జూన్ 30 వరకు ఏటీఎం సర్వీస్ ఛార్జీలు లేవని స్పష్టం చేసింది ఎస్బీఐ.
సాధారణంగా ప్రతీ ఏటీఎం కార్డుకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి ఎన్నిసార్లు ఉపయోగించాలన్న లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ కార్డును బట్టి బ్యాంకు నిర్ణయిస్తుంది. కొన్ని కార్డులకు ఎక్కువసార్లు, ఇంకొన్ని కార్డులకు తక్కువ సార్లు ఉచిత ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ లిమిట్ దాటితే ఏటీఎం సర్వీస్ ఛార్జీని కస్టమర్లు చెల్లించాల్సిందే. అందుకే చాలామంది ఆ లిమిట్ లోపే డ్రా చేస్తారు. అత్యవసరమైతే తప్ప లిమిట్ తర్వాత డబ్బులు డ్రా చేయరు. అలాంటి పరిస్థితుల్లో సర్వీస్ ఛార్జీ చెల్లించక తప్పదు. ఇప్పుడు ఎస్బీఐ ఏటీఎం సర్వీస్ ఛార్జీ ఎత్తేయడం కోట్లాది ఖాతాదారులకు మేలు చేస్తుంది.