మహీంద్రా సేవలకు అమెరికాలో ప్రత్యేక గుర్తింపు…కరోనా రక్షణ పరికరాల ఉత్పత్తిలో ముందడుగు..
భారత్కు చెందిన మహీంద్రా గ్రూప్ కరోనా వైరస్ మహమ్మారి పోరులో అగ్రభాగాన నిలుస్తున్న వైద్య సిబ్బంది రక్షణ కోసం ప్రత్యేక పరికరాలను తయారుచేస్తోంది. దీనిపై అమెరికాకు చెందిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ డిపార్ట్ మెంట్ పాంపియో ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అమెరికాలోని సౌత్ఈస్ట్ మిచిగాన్లో మహీంద్రా ఆబర్న్ హిల్స్ ప్లాంట్ లో వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ) తయారు చేస్తోంది. మహీంద్రా గ్రూప్ మిచిగాన్లో జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్స్ కంపెనీలతో జత కలిసింది. మహీంద్రా రాక్సోర్ వాహనాల్లో వాడే విండ్ షీల్డ్స్ తయారు చేసే పదార్థంతో ఫేస్ షీల్డ్స్, మాస్క్ లు, ఆస్పిషన్ బాక్సులను తయారు చేస్తోంది. విండ్షీల్డ్స్లో ఉపయోగించే పాలికార్బోనేట్ పదార్థంతోనే ఈ పెట్టెలను తయారుచేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇవి కోవిడ్-19 బారిన పడిన రోగి ఇంట్యుబేషన్ గొట్టాలను తొలగిస్తున్నపుడు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ఇవి రక్షణ కవచంగా ఉపయోగపడతాయని నార్త్ అమెరికా మహీంద్రా ఆటోమోటివ్ సీఈవో రిక్ హాస్ వెల్లడించారు. ఈ పరికరాల తయారీలో ఆబర్న్ హిల్స్ ప్లాంట్ కు చెందిన ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారనీ, సంక్షోభ సమయంలో ఫ్రంట్లైన్ కార్మికులకు అవసరమైన ఉత్పత్తులను అందించడంలో ఇదొక వినూత్న విధానమని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలోని ఓ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ ఫెసిలిటీలో పనిచేసే మహీంద్రా ఉద్యోగి భార్య ఈ బాక్సులను తయారు చేయాలని సూచించారు. వైరస్ కారణంగా ఒక నెల క్రితం మూసివేసిన ఈ ప్లాంట్ లో ప్రస్తుతం 2వేల మందికి ఉపాది లభించింది. తమ కంపెనీ ఉత్పత్తికి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోందని, ఈ డిజైన్లను భారతదేశంలో తయారీకి అనువుగా సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపించామని చెప్పారు