Leading News Portal in Telugu

Paytm: పేటీఎంతో మీరూ డబ్బులు సంపాదించొచ్చు… ఎలాగంటే

మీరు పేటీఎం యాప్ వాడుతున్నారా? అయితే మీరూ డబ్బులు సంపాదించొచ్చు. ఈ అవకాశాన్ని కల్పిస్తోంది పేటీఎం. ఇందుకోసం వొడాఫోన్ ఐడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘రీఛార్జ్ సాథీ’ పేరుతో ఓ ప్రోగ్రామ్ ప్రకటించింది. వ్యక్తిగతంగా ఎవరైనా లేదా చిరు వ్యాపారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ చేసి కమిషన్ సంపాదించొచ్చు. ఇందుకోం మీకు కావాల్సింది పేటీఎం యాప్ మాత్రమే. మీ పేటీఎం యాప్ నుంచి వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు రీఛార్జ్ చేయాలి. ఇందుకోసం మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా పాన్ నెంబర్ లాంటి వివరాలేవీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ‘రీఛార్జ్ సాథీ’ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసిన తర్వాత వొడాఫోన్ ఐడియా నెంబర్లకు రీఛార్జ్ చేయొచ్చు. ఐదు రీఛార్జులు చేసిన తర్వాత రూ.40 క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత ప్రతీ రూ.100 రీఛార్జ్‌పై 4 శాతం అంటే రూ.4 కమిషన్ లభిస్తుంది.

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా బయట రీటైల్ స్టోర్స్ తెరుచుకోవట్లేదు. ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకునేవారికి సమస్య లేదు. కానీ రీటైల్ షాపుల్లో రీఛార్జ్ చేసుకునేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందులు తీర్చేందుకు వొడాఫోన్ ఐడియాతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది పేటీఎం. స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించనివారు, ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోలేని కస్టమర్లకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. తమ కాలనీలో ఉండేవారికి, స్నేహితులు, బంధువులకు రీఛార్జ్ చేయడం ద్వారా ఎవరైనా డబ్బు సంపాదించొచ్చు. వ్యక్తిగతంగా లేదా చిరు వ్యాపారులు ‘రీఛార్జ్ సాథీ’ ప్రోగ్రామ్ ద్వారా నెలకు రూ.5,000 వరకు సంపాదించొచ్చని చెబుతోంది పేటీఎం. ఇప్పటికే జియో కూడా ఇలాంటి కార్యక్రమాన్నే ప్రారంభించింది. ఇందుకోసం ‘జియోపీఓఎస్ లైట్’ యాప్‌ను రూపొందించింది. జియో రీఛార్జ్‌ల ద్వారా డబ్బు సంపాదించొచ్చు. ఎలాగో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.