Leading News Portal in Telugu

తెలంగాణలో పారిపోయిన ఖైదీ… చేతిలో తుపాకీతో

Telangana : అది నిజామాబాద్ జిల్లాలోని… ప్రభుత్వ ఆస్పత్రి. డాక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది అంతా కరోనా వైరస్ కేసుల టెన్షన్‌లో బిజీగా ఉన్నారు. అలాంటి చోటికి… మూడ్రోజుల కిందట రాత్రివేళ రిమాండ్ ఖైదీ జీలకర్ర ప్రసాద్‌ని ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకొచ్చారు. అతనికి వచ్చిన అనారోగ్యం ఏంటో తేల్చమన్నారు. ఐతే… అతను తన పక్కనున్న కానిస్టేబుల్‌ని కొట్టి… అతని దగ్గరున్న తుపాకీ లాక్కొని పారిపోయాడు. అయ్యో అయ్యో అంటూ… ఆస్పత్రి బయటకు వచ్చి చూస్తే… ఎక్కడా ప్రసాద్ కనిపించలేదు. అమ్మో అమ్మో అనుకుంటూ… వెంటనే పై అధికారులకు కాల్ చేసి విషయం చెప్పాడు. అప్పటికప్పుడే వేరే విధుల్లో ఉన్న పోలీసుల్ని… ప్రత్యేక బృందాలుగా చేసి… బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చి… సిటీ మొత్తం వెతకమని పంపారు. వాళ్లేమో మూడ్రోజులుగా వెతికినా ప్రయోజనం లేకపోయింది.

ప్రసాద్ పారిపోవడానికి ఛాన్స్ ఇచ్చిన కానిస్టేబుళ్లు ఇద్దరిపైనా పై అధికారులు… ఎంక్వైరీకి ఆదేశించారు. ఎందుకంటే ప్రసాద్ అల్లాటప్పా నేరస్థుడు కాదు. నిజామాబాద్‌ నగరంలోని గౌతంనగర్‌కు చెందిన వాడు. పదేళ్లుగా దొంగతనాలు, దోపిడీలూ చేస్తున్నాడు. ఎక్కువ కేసులు మాక్లూర్‌ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల చేస్తున్నాడు. చిన్నాపూర్‌ గండి ప్రాంతంలో దారి దోపిడీలు చేశాడు. చాలా రకాల నేరాల్లో నిందితుడు. ఈ పనుల్లో పడి… కొన్నేళ్లుగా భార్యా, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు అతని దగ్గరున్న తుపాకీ (షార్ట్ వెపన్)‌లో 10 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయి. అసలే మొండి నేరగాడు. ఇప్పుడు ఆయుధం దొరికింది. ఏం చేస్తాడో అనే టెన్షన్ పోలీసుల్లో ఉంది. ఐతే… పోలీసులు అతన్ని ఎన్‌కౌంటర్ చెయ్యడానికే ఇలా అతను దొరకట్లేదని చెబుతున్నారని కొందరు అంటున్నారు.