మద్యం దొరక్క అవి తాగి… ఆరుగురు మృత్యువాత
హైదరాబాద్లో కరోనా లాక్డౌన్ కారణంగా కల్లు దుకాణాలు బంద్ అవ్వడంతో… పిచ్చెక్కినట్లు అయిపోతూ… ఏదేదో తమలో తామే మాట్లాడుకుంటూ… వింతగా ప్రవర్తిస్తున్న 1000 మందికిపైగా వ్యక్తులను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే… తమిళనాడులో ప్రాణాలే పోతున్నాయి. గత వారం మద్యం దొరక్క మొత్తం ఆరుగురు చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. నాల్రోజుల కిందట పుదుకొట్టాయ్లో కూల్ డ్రింకుల్లో షేవింగ్ లోషన్ కలిపి తాగి… ముగ్గురు చనిపోయారు. తాజాగా చెంగల్పట్టు జిల్లాలో మరో ముగ్గురు చనిపోయారు. మద్యం దొరకట్లేదన్న ఉద్దేశంతో… వీళ్లు…. కూల్ డ్రింకుల్లో పెయింట్ వార్నిష్ కలిపి తాగారు. అది పాయిజన్గా మారి ప్రాణాలు తీసింది.
రోజూ కల్లో, మద్యమో తాగుతున్నవారికి లాక్డౌన్ వచ్చాక… ఒక్కసారిగా కిక్కు లేకుండా పోయింది. అప్పటివరకూ వాటికి అలవాటుపడిన ప్రాణాలు… ఇప్పుడు అవి లేకపోతే… నాలిక పీకేసినట్లు ఫీలవుతూ… ఇబ్బంది పడుతున్నారు. కేరళలో ఈ పరిస్థితి తీవ్రంగా మారడం, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే… అక్కడి పినరయి విజయన్ ప్రభుత్వం… పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి… కొద్ది మొత్తంలో మద్యం ఇవ్వమని అధికారులను ఆదేశించింది. దీనిపై డాక్టర్లు మండిపడుతున్నారు. మద్యం లేక మానసిక స్థితి బాగోకపోతే… ఆస్పత్రులకు పంపాలిగానీ… ప్రభుత్వమే మద్యం ఇవ్వడమేంటని అంటున్నారు. మందులతో తగ్గించాల్సిన సమస్యను… మద్యంతో తగ్గిస్తామనడమేంటని ఫైర్ అవుతున్నారు.
మద్యానికి అలవాటు పడిన వారికి… పెయింట్ వార్నిషింగ్, షేవింగ్ లోషన్ వంటి వాటి వాసన బాగా నచ్చుతుంది. అందుకే వారు వాటిని నీటిలో, కూల్ డ్రింక్స్లో కలుపుకొని… అదే మద్యంలా ఫీలవుతూ తాగుతున్నారు. ఇది భయంకర పరిణామం. ఒక రకంగా విషాన్ని తాగుతున్నట్లే. ఎవరైనా మద్యం దొరక్క వింతగా ప్రవర్తిస్తుంటే… వెంటనే వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్తే… మందుల ద్వారా నయం చేస్తామంటున్నారు డాక్టర్లు.