ప్రియుడు అన్న వరస అవుతాడని వద్దన్నందుకు.. సొంతక్కపైనే ప్రియుడితో కలిసి.
చెల్లెలు ప్రేమించిన యువకుడు అన్న వరస అవుతాడని ఆ ప్రేమను కొనసాగించవద్దన్నందుకు ఓ యువతి సొంత అక్కనే ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపింది. ఈ ఘటన చెన్నైలోని నామక్కల్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోసవంపట్టి దేవేంద్రపురం గ్రామానికి చెందిన శంకరన్ పెద్ద కూతురు మోనిషా(18) నామక్కల్లో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈనెల 4న మోనిషా ఇంట్లో ఒంటరిగా ఉంది.
బయటకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా, మోనిషా ఎడమచేతిని కత్తితో కోసుకున్నస్థితిలో పడి ఉంది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే మోనిసాను హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. దీంతో నామక్కల్ పోలీసులు మొదట ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే మోనిషా మరణించినట్టు తేలింది.
దీంతో పోలీసులు ఆమె మరణాన్ని హత్య కేసుగా నమోదు చేసుకుని విచారణ చేశారు. విచారణలో సొంత చెల్లెలే తన ప్రియుడు రాహుల్(19)తో కలిసి మోనిషాను హత్య చేసినట్టు తెలిసింది. ఇదిలావుంటే.. రాహుల్ ఆమెకు అన్న వరస అవుతాడని మోనిషాతో పాటు ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను వ్యతిరేకించారు. దీంతో ఆగ్రహించిన మోనిషా చెల్లెలు, ప్రియుడు రాహుల్తో కలిసి గొంతునులిమి చంపినట్టు తేలింది.