Leading News Portal in Telugu

మధిర గెస్ట్‌హౌజ్‌లో పార్టీ చేసుకున్న నలుగురు అధికారులపై కేసు నమోదు..

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఓ నలుగురు ప్రభుత్వ అధికారులు మద్యం పార్టీ చేసుకున్న విషయం ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి నలుగురు ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధిర పట్టణంలోని ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లో లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్రభుత్వ అధికారులు మద్యం పార్టీ చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వైద్యుడు అప్పుడే పోలీసులకు దొరకగా, మిగిలిన ముగ్గురు ప్రభుత్వ అధికారులు పారిపోయారు. అయితే వారిని పోలీసులు గుర్తించి లాక్‌డౌన్ సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మద్యం పార్టీ నిర్వహించిన ఆ నలుగురు ప్రభుత్వ అధికారులపై కేసు నమోదు చేశారు. ఇందులో ఓ తహసీల్దార్, పంచాయతీరాజ్, రూరల్ డవలప్‌మెంట్ విస్తరణ అధికారి, ప్రభుత్వ వైద్యుడు, సబ్ జైలర్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో సబ్ జైలర్‌ను సస్పెన్షన్ విధించినట్టు తెలుస్తోంది.