
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందింది ఈ చిత్రం. ముందుగా ఈ సినిమా కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు వినిపించారట దర్శకుడు వంశీ. కానీ, ఈ కాంబో మాత్రం సెట్ కాలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించాలని ప్రయత్నించినా కుదర్లేదు. దాంతో, వంశీ.. రవితేజ ను కలిసి స్టోరీ వినిపించగా ఆయన వెంటనే ఓకే చేశారు. ఈ దర్శకుడి గత చిత్రం దొంగాట సినిమా చోరీ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే..రవితేజకు ఇది ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్. ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ పరంగా అలాగే లుక్ పరంగా చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్,గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ లు గా నటించారు.అనుక్రీతి వాస్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.దాదాపు 20 ఏళ్ల తర్వాత నటి రేణూ దేశాయ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. సంఘ సంస్కర్త గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రను ఆమె పోషించారు. ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్ మరియు నాజర్, మురళీ శర్మ, జిషుసేన్ గుప్త, హరీశ్ పేరడి, సుదేవ్ నాయర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
2019లోనే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.. ఈ సినిమా కథ కోసం దర్శకుడు దాదాపు రెండేళ్లు రీసెర్చ్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు గురించి అప్పట్లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుకునేవారు. ఆయన చేసిన సాహసాల గురించి ఎన్నో కథలున్నాయిగానీ వాటికీ తగిన ఆధారాల్లేవు. అందుకే ‘ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ రూమర్స్’ అని ఈ సినిమాకి క్యాప్షన్ ను పెట్టారు.టైగర్ నాగేశ్వరరావు పైకి భయంకరంగా కనిపించినా ఆయన మనసున్న మనిషి అని, ఈ రెండో కోణాన్నే సినిమాలో చూపించాలనిపించిందని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.నాటి పరిస్థితులకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకు టెక్నికల్ టీం ఎంతో శ్రమించింది. సినిమాకు కీలకంగా నిలిచే ట్రైన్ సీక్వెన్స్ కోసం గోదావరి బ్రిడ్జ్ ని రీ క్రియేట్ చేశారు. సంబంధిత సన్నివేశాలు చిత్రీకరించేందుకు దాదాపు 20 రోజుల సమయం పట్టగా గ్రాఫిక్స్ వర్క్ కోసం ఏడాది పట్టిందట.స్టూవర్టుపురం గ్రామాన్ని తలపించేలా దాదాపు రూ.7 కోట్లతో ఓ సెట్ను శంషాబాద్ సమీపంలో సుమారు 5 ఎకరాల స్థలంలో తీర్చిదిద్ది అక్కడే అధిక భాగం అక్కడే చిత్రీకరణ చేశారు.అలాగే బధిరుల కోసం సైన్ లాంగ్వేజ్ లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సైన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యే తొలి భారతీయ చిత్రం కూడా ఇదేనని చిత్రబృందం పేర్కొంది.