జర్నలిస్ట్ సోదరులకు దర్శకుడు హరీష్ శంకర్ సాయం..
కరోనా వైరస్ కారణంగా మన దేశం మాత్రమే కాదు.. ప్రపంచమే స్థంభించిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కోక్కరు ఒక్కోరకంగా తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా పని లేకుండా పోయిన పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసారు. మరి కొంత మంది హీరోలు తమ వంతుగా ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్కు చేతనైనా సాయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్.. తన పుట్టినరోజు సందర్భంగా అనాథలైన 45 మంది అనాథ పిల్లలకు రెండు నెలలకు సంబంధించిన నిత్యావసరాలు అందించారు. దీని కోసం దర్శకుడు హరీష్ శంకర్.. హెల్పింగ్ హ్యాండ్స్ హుమానిటీ పేరిట ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు కరోనా పై పోరాటంలో డాక్టర్లు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, పారిశుద్ధ కార్మికులతో పాటు అహర్నిశలు తమ ప్రాణాలను పణంగా పెట్టి క్షేత్ర స్థాయి వార్తలను ప్రజలకు అందిస్తున్న జర్నలిస్టులకు తన వంతు సాయం చేసాడు. ఎంపిక చేసిన 100 మంది జర్నలిస్టులకు ఆయన ఈ సాయం అందించారు. ఈ సాయాన్ని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ చేతులు మీదుగా ఎంపిక చేసిన జర్నలిస్టులకు సరుకులు అందజేసారు.
హరీష్ శంకర్ విషయానికొస్తే.. గతేడాది వరుణ్ తేజ్తో ‘వాల్మీకీ’ సినిమా తెరకెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.