పప్పుల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు.. అందుకే చాలా మంది ఒకేసారి కొని పెట్టుకుంటారు.. ఏడాదికి సరిపడా పప్పుధాన్యాలను ఒకేసారి కొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అవి పాడవ్వకుండా, పురుగులు పట్టకుండా జాగ్రత్తగా ఎయిర్ టైట్ డబ్బాల్లో స్టోర్ చేస్తూ ఉంటారు, తడి చేతులతో తాకరు. అయినా కూడా కొన్నిసార్లు పప్పులు, బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. పప్పులు, బియ్యానికి పురుగులు పట్టకుండా రక్షించుకోవచ్చు… ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్లుల్లిని వాడటం మంచిది..పప్పుల డబ్బాలో కొన్ని పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పప్పులకు పురుగులు పట్టకుండా ఉంటాయి. మీరు పప్పుల పెట్టెలో 4-5 వెల్లుల్లి రెబ్బలను ఉంచండి. ఆవి ఎండిపోయిన తర్వాత, అవి తీసి మీరు ఫ్రెష్ వెల్లుల్లి రెబ్బలు పెట్టండి..
అలాగే ఎండు వేపాకులను వాడటం అనేది ఎన్నో ఎళ్లుగా ఫాలో అయ్యే పద్ధతి. ఇది పప్పులను పురుగులు పట్టకుండా రక్షించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. మీరు పప్పులు, బియ్యం స్టోర్ చేసే డబ్బాలో ఎండిపోయిన వేప ఆకులను ఉంచండి. ఇది పప్పుధాన్యాలలో కీటకాలు రాకుండా రక్షిస్తుంది. పప్పులే కాదు, అలమారాల్లో ఎండు వేప ఆకులను ఉంచితే సిల్వర్ ఫిష్ పురుగులు రాకుండా ఉంటాయి..
లవంగాలను వంట రుచి పెంచడానికి వాడుతుంటాం. ఇవి పప్పుధాన్యాలను పురుగులు పట్టకుండా రక్షిస్తాయి కూడా. మీరు చేయాల్సిందల్లా పప్పులు స్టోర్ చేసిన డబబ్బాలో 8-10 లవంగాలు వేసిన క్లాత్ బ్యాగ్ ఉంచండి. ఆ డబ్బాకు గాలి చొరబడకుండా చూసుకోండి..
మీ పప్పు దినుసులు ఉంచిన డబ్బాలో 3 ఎండుమిరపకాయలు ఉంచండి. ఎండు మిర్చీ ఘాటుకు పురుగులు పట్టకుండా ఉంటాయి..
పప్పులను ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే పురుగుల నుంచి పప్పుల నుంచి రక్షించడమే కాదు, పప్పులను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. మీరు వాటిని గాలి చొరబడని కంటైనర్లలో లేదా జిప్లాక్ ప్యాకెట్లలో నిల్వ చేయవచ్చు..
ఒకవేళ పప్పుకు పురుగు పట్టినట్లు గుర్తిస్తే.. దాన్ని క్లాత్పై వేసి కనీసం రెండు మూడు రోజులు ఎండలో ఉంచండి. చీకటి, చల్లగా ఉన్న ప్రదేశాలలో పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పప్పులను ఎండలో ఉంచితే అవి పారిపోతాయి.. అప్పుడప్పుడు ఎండలో ఉంచితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి..