Leading News Portal in Telugu

Chandrayaan-3: చంద్రయాన్‌-3 విజయం.. ఇస్రోకు స్పేస్ ఏజెన్సీల అభినందనలు


Chandrayaan-3: జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్​ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి. ఇస్రోకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియా ట్విటర్‌ వేదికగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతమైనందుకు ఇస్రోకు శుభాకాంక్షలు, చంద్రుడిపై వ్యోమనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఈ మిషన్‌లో మీతో భాగస్వాములైనందుకు మాకు ఆనందంగా ఉంది’’ అని బిల్ నెల్సన్‌ ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రయాన్​ 3 విజయం పట్ల బ్రిటన్​ అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా అభినందనలు తెలిపింది.

చంద్రయాన్‌-3 విజయంపై నేపాల్‌ ప్రధాని పుష్పకుమార్‌ దహల్.. భారత ప్రధాని, ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈ రోజు అంతరిక్ష పరిశోధన చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఆ దేశ విదేశాంగ మంత్రి ఎన్​పీ సౌద్​ కూడా ఇస్రోకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రయోగంపై అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్​ సీఈఓ ముఖేశ్ అగి ప్రశంసలు కురిపించారు. భారత ప్రజలకు ఇది ఎంతో చారిత్రక సంఘటన అని కొనియాడారు. మానవులకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి చేసే ప్రయత్నాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

చంద్రయాన్-3 విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అత్యంత సమీపంలో వ్యోమనౌకను దింపిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది భారత్‌. అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తరువాత విజయవంతంగా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా భారత్‌ నిలిచింది. ప్రస్తుతం చంద్రుడిపై దిగిన ల్యాండర్ సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తోంది. కాబట్టి.. చంద్రుడి కాలమానం ప్రకారం ఒక రోజు మాత్రమే ( మన లెక్కలో 14 రోజులు) కార్యకలాపాలు నిర్వహించగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, మరుసటి రోజు సూర్యోదయం తరువాత (14 రోజుల తర్వాత) రోవర్ పునరుజ్జీవం పొందే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.