Leading News Portal in Telugu

Tamilisai Soundararajan: “అత్యంత దుర్మార్గం, అజ్ఞానం”.. ఉదయనిధి సనాతన వ్యాఖ్యలపై గవర్నర్..


Tamilisai Soundararajan: సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇప్పటికే బీజేపీ డీఎంకే పార్టీ, ఉదయనిధి, సీఎం స్టాలిన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరిగా డీఎంకేపై విరుచుకుపడుతున్నారు. ఇండియా కూటమిలో డీఎంకే పార్టీ కూడా ఉండటంతో ఇండియా కూటమి తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ‘అత్యంత దుర్మారం-అజ్ఞానం’తో కూడినవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి సనాతన ధర్మం గురించి తెలియదని అన్నారు. ఉదయనిధి సమానత్వం గురించి మాట్లాడితే..హిందువులపై ఎందుకు వివక్ష చూపుతున్నాడని తమిళిసై ప్రశ్నించారు.

ఉదయనిధి స్టాలిన్ తండ్రి సీఎం ఎంకే స్టాలిన్ హిందువుల పండగలకు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పరని అమె అన్నారు. దీపావళి, కృష్ణజయంతి, వినాయక చతుర్థి వంటి పండగలకు ఆయన శుభాకాంక్షలు చెప్పరని, ఇదేం వివిక్ష అంటూ ప్రశ్నించారు. మెజారిటీ జనాభా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు అతను ఆ మతాన్ని ఎలా రద్దు చేస్తారని గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు. తనను తాను గొప్ప క్రైస్తవుడిగా పేర్కొంటున్న ఆయన ఎందుకు ఇంకో మతాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నారని, ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఉదయనిధిని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు.