Leading News Portal in Telugu

Rahul Gandhi: జీ20 సదస్సుకు ముందు రాహుల్ గాంధీ యూరప్ పర్యటన


Rahul Gandhi: దేశంలో ఓ వైపు ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు మందు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ యూరప్ పర్యటకు వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన వివిధ దేశాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం ఆయన బ్రస్సెల్స్ చేరుకున్నారు. అక్కడి ప్రవాస భారతీయులతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు, న్యాయవాదులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారు.

రాహుల్ గాంధీ అన్ని సమావేశాలను ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ సమన్వయం చేస్తోంది. రాహుల్ గాంధీతో పాటు శామ్ పిట్రోడా కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. బ్రస్సెల్స్ లో మీడియాతో మాట్లాడుతారు. ఫ్రెంచ్ చట్టసభ సభ్యలతో భేటీ అవుతారు. భారత్ రావడానికి ముందు నార్వేలో పర్యటిస్తారు. రాజధాని ఓస్లోలో ఆ దేశ పార్లమెంట్ సభ్యులను కలవాలని రాహుల్ భావిస్తున్నారు.

అంతకుముందు రోజు రాహుల్ గాంధీ తన ఎక్స్ అకౌంట్ లో భారత జోడో యాత్ర గురించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. గతేడాది సెప్టెంబర్ 7న జోడో యాత్ర మొదలైంది. ఈ రోజుతో ఏడాది పూర్తైంది. విద్వేషం తొలిగిపోయే వరకు ప్రయాణం కొనసాగుతుందని, ఐక్యత, ప్రేమ వైపు వేలాది అడుగులు వేసేందుకు జోడో యాత్ర కారణమైందని ఆయన పోస్ట్ చేశారు.

‘మోడీ ఇంటి పేరు’ వివాాదంపై రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయన ఎంపీ పదవి మళ్లీ పునరుద్ధరించారు. దీని తర్వాత ఆయన చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన యూకే పర్యటనకు వెళ్లారు. జీ20 సమావేశాలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 12 ఆయన తిరిగి ఇండియా రానున్నారు.