Leading News Portal in Telugu

Tamil Nadu: కులం అడ్డుగోడలు ఛేదించారు.. తొలిసారి ఆలయ పూజారులుగా ముగ్గురు మహిళలు..


Tamil Nadu: తమిళనాడులో తొలిసారిగా ముగ్గురు మహిళలు ఆలయ పూజారులుగా మారారు. కులాల అడ్డుగోడలను ఛేదించి దేవుడి గర్భగుడిలోకి ప్రవేశించి లింగసమానత్వాన్ని తీసుకురానున్నారు. దేవుడి సేవ చేసుకునే భాగ్యం కొన్ని కులాలకే కాదు అందరికి ఉందనే నిజాన్ని చాటి చెప్పేందుకు ఈ ముగ్గురు మహిళలు సిద్దమయ్యారు. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే యువతులు తమిళం, సంస్కృతం చదువుతూ శ్రీరంగం ఆలయంలో ఒక ఏడాది కోర్సును పూర్తి చేశారు.

కడలూర్ కి చెందిన టైలర్ కుమార్తె, మ్యాథ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రమ్య మాట్లాడుతూ..ఆలయంలో దేవుడికి సేవ చేయడం ఆనందంగా ఉందని, దేవుడికి సేవ చేయాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అన్ని కులాల వారు పూజారులు కావచ్చని తమిళనాడు ప్రభుత్వం చెప్పినప్పుడు తాను ఎంతో సంతోషించానని తెలిపారు. తామే మొదటి ఆయల పూజారులమైనందుకు గర్వంగా ఉందని, అన్ని వ్యతిరేకతలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తమకు మద్దతు ఇచ్చిందని, ప్రజలు కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు రమ్య తెలిపారు. ముగ్గురు మహిళలు సహాయ అర్చకులుగా నియమితులయ్యే ముందు తమిళనాడు దేవాలయాల్లో ఏడాది పాటు శిక్షణ పొందారు.

తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి స్టాలిన్ కి కృష్ణవేణి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు పైలెట్లు, వ్యోమగాములుగా విజయాలు సాధిస్తున్నారు, అయితే ఆలయ పూజారులుగా పనిచేయడం అపవిత్రంగా మార్చారు, ఇప్పుడు అన్నీ మారాయని, మార్పు వచ్చిందని, అన్ని కులాల వారిని ఆలయాల్లో పూజారుగా నియమించడం ద్వారా పెరియాల్ గుండెలో ముల్లును తీసేసినట్లు అయిందని, సమానత్వపు కొత్త శకాన్ని తీసుకువస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ ట్వీట్ చేశారు.