Leading News Portal in Telugu

India-China: భారత ఆటగాళ్లకు అనుమతివ్వని చైనా.. పర్యటన రద్దు చేసుకున్న అనురాగ్


రేపటి నుంచి చైనాలోని జాంఘులో జరగనున్న 19వ ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు అనుమతి చైనా అనుమతి నిరాకరించింది. ఈ చర్యపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని చైనా ఎంబసీ, బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ముగ్గురు భారతీయ వుషు ఆటగాళ్లు నైమాన్ వాంగ్సు, ఒనిలు తేగా, మెపుంగ్ లాంగులకు చైనా అనుమతి నిరాకరించింది.

ఈ వ్యవహారంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. చైనా ఎప్పుడూ భారతీయ పౌరుల పట్ల జాతి ప్రాతిపదికన వివక్ష చూపుతోందని అన్నారు. అలాంటి వాటిని భారత్ పూర్తిగా తిరస్కరిస్తుందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులకు చైనా అక్రిడిటేషన్‌ను నిరాకరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. చైనా ఆసియా క్రీడల స్ఫూర్తిని.. అందులో పాల్గొనే నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తుందని తెలిపారు.

ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్‌జౌకు విమానంలో బయల్దేరింది. అయితే వీరిలో ముగ్గురికి చైనా అనుమతి నిరాకరిచడంతో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌కు భారత ఆటగాళ్లను అధికారులు తీసుకొచ్చారు. అయితే త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అరుణాచల్‌ను తమ భాగమని చైనా పేర్కొంటూ.. తమ పౌరులను భారతీయులుగా పిలవడాన్ని వ్యతిరేకిస్తోంది. అంతకుముందు జూలైలో కూడా అరుణాచల్‌కు చెందిన ఆటగాళ్లకు ఎంట్రీ ఇవ్వడానికి చైనా నిరాకరించింది. దీనికి భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైనా ఇలా చేయడం ఇది రెండోసారి.