Leading News Portal in Telugu

UP Police: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిపై పోలీసు అత్యాచారం!


Dalit Woman Raped by SI in UP: ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. సమాజం తలదించుకునే పని చేశాడు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చిన ఓ దళిత మహిళపై సబ్-ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళపై అత్యాచారం చేసిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ ఎస్సైని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి..

సరాయ్ మమ్రేజ్ పోలీస్ స్టేషన్‌లో సుధీర్ కుమార్ పాండే సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. కొందరు ఆకతాయిలు తనను వేధింపులకు గురి చేస్తున్నారని, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ దళిత మహిళ ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చింది. ఎస్సై సుధీర్‌ కుమార్‌ పాండేకు విషయం చెప్పి.. ఫిర్యాదు చేసింది. నిందితులను అరెస్టు చేసేందుకు వెళుతున్నట్లు చెప్పిన ఎస్సై.. యువతిని తన కారులో ఎక్కించుకున్నాడు.

ఎస్సై సుధీర్‌ కుమార్‌ పాండే మార్గమధ్యలో కారు ఆపి మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను దళిత మహిళతో తాగించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక.. కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మెలుకువ వచ్చాక విషయం తెలుసుకున్న బాధితురాలు సదురు పోలీసుపై ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 21న సుధీర్ కుమార్ పాండే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దాంతో సీనియర్ పోలీసు అధికారి సుధీర్ కుమార్ అతడిని (ఎస్సై) ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. పరారీలో ఉన్న ఎస్సై కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా హండియా ఏసీపీ సుధీర్‌ కుమార్‌ను పోలీసు కమిషనర్ రమిత్ శర్మ ఆదేశించారు.