Leading News Portal in Telugu

UP Police: యూపీలో దారుణం.. వికలాంగ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కానిస్టేబుళ్లు!


Lady Constables drag Woman on road in UP’s Hardoi: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకొంటూ తీసుకువెళ్లారు. ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్‌స్టేషన్‌ వరకు ఆమెను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కేశవ్ చంద్ర గోస్వామి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

హర్దోయీ జిల్లాలో పిహానీ ప్రాంతానికి చెందిన ఓ వికలాంగ మహిళ శనివారం ఎస్పీ కార్యాలయంకు వచ్చింది. ఆమెను ఎస్పీ కార్యాలయం లోపలికి అనుమతించకుండా.. ఇద్దరు మహిళా పోలీసులు అడ్డుకున్నారు. ఆపై ఆ వికలాంగ మహిళను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. మహిళను నేల మీదు పోలీస్ స్టేషన్ వైపు లాక్కుంటూ తీసుకెళ్లారు. ఎస్పీ కార్యాలయం బయట జరిగిన ఈ ఘటన చూసి అటుగా వెళుతున్న అందరూ షాక్ అయ్యారు.

ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్తతో విభేదాలు రావడంతో ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చానని, తనను లోపలికి అనుమతించకుండా పోలీసులు ఈడ్చుకెళ్లారని సదరు మహిళ చెబుతోంది. ఎస్పీ కార్యాలయం గోడ ఎక్కేందుకు ప్రయత్నం చేసిందని, అందుకే ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు.