Leading News Portal in Telugu

Ashok Gehlot: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’.. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ క్షమాపణలు


Ashok Gehlot: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ హైకోర్టులో క్షమాపణలు చెప్పారు. గెహ్లాట్ తన వ్రాతపూర్వక సమర్పణలో, తన వ్యాఖ్యలు తన ఆలోచనలు కాదని, బాధ కలిగించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. న్యాయవ్యవస్థపై అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలతో నెల రోజుల పాటు సాగిన వివాదానికి ఆయన క్షమాపణ చెప్పారు.

ఆగస్టు 30న ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేడు న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోంది.. కొందరు న్యాయవాదులు స్వయంగా రాతపూర్వకంగా తీర్పును తీసుకుని అదే తీర్పును వెలువరించారని విన్నాను’ అని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో న్యాయవాదులు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. న్యాయవాదుల నుంచి సీఎం తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోగా.. ముఖ్యమంత్రిపై న్యాయవాదులు కేసు పెట్టారు. ధిక్కార చర్యలు కోరుతూ ఆయనపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది.

సెప్టెంబరు 5న విచారణకు లిస్ట్ చేయబడిన పిల్‌ నేపథ్యంలో గెహ్లాట్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. న్యాయవ్యవస్థలో అవినీతిపై తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం కాదన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై తనకు ఎప్పుడూ గౌరవం, నమ్మకం ఉందని స్పష్టం చేశారు.