
ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్య అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది.. కాలుష్య నియంత్రణ అనేది ఢిల్లీ ప్రభుత్వానిదే కాదు కేంద్రం ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారు.. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకి చర్యలు తీసుకోవాలి అని మాజీ ఉప రాష్ట్రపతి సూచించారు. ఇది చాలా కీలక సమయం.. మాజీ ఉపరాష్ట్రపతిగా ప్రజా జీవితంలో ఉన్న, సమస్యలను పరిశీలిస్తున్నాను అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆర్ధిక పరిస్థితులు, భవిష్యత్ లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆర్ధిక వనరులు ఉంటాయా అని అంచనా వేయకుండా హామీలు ఇస్తుంటారు.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే దేశంలో పేద, మధ్య తరగతి, మధ్య తరగతికి దిగువన అనేక మంది ప్రజలు ఉన్నారు అని వెంకయ్య నాయుడు తెలిపారు.