Leading News Portal in Telugu

Supreme Court: విచారణ టైంలో మొబైల్-ల్యాప్‌టాప్‌ను జప్తు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య


Supreme Court: విచారణ టైంలో మొబైల్-ల్యాప్‌టాప్‌ను జప్తు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

Supreme Court: విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు సంస్థల ఈ పద్ధతి చాలా ప్రమాదకరమని సుప్రీంకోర్టు అభివర్ణించింది. విచారణ సమయంలో డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రమాదకరం మాత్రమే కాదు, ఇది వ్యక్తుల గోప్యతను కూడా ప్రభావితం చేస్తుందని కోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లో మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం రెండు పిటిషన్లపై విచారణ జరుపుతోంది. వీటిలో ఒక పిటిషన్‌ను ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో డిజిటల్ పరికరాల జప్తుకు మార్గదర్శకాలను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఈ అంశం చాలా ముఖ్యమైనదని ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఎలక్ట్రానిక్ పరికరాలను ఎప్పుడు, ఎందుకు స్వాధీనం చేసుకుంటాయనే దానిపై మార్గదర్శకాలు లేవు. కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. పదేపదే నేరాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు ముఖ్యమైన డేటాను దొంగిలించగలరని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి కొంత సమయం కావాలన్నారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది.