Leading News Portal in Telugu

Rs. 25 Crores in Garbage Dump: చెత్త ఏరుకోవడానికి వెళ్తే రూ.25 కోట్లు దొరికాయి..!



Garbage Dump

Rs. 25 Crores in Garbage Dump: చెత్త ఏరుకొని జీవనం సాగించేవారు ఎందరో ఉన్నారు.. కొన్నిసార్లు వాళ్లకు చెత్తలో విలువైన వస్తువులు దొరికిన సందర్భాలు ఉంటాయి.. చిల్లర, పదోపాతికో దొరికిన ఘటనలు లేకపోలేదు.. కానీ, ఒకేసారి కోట్లలో సొమ్ము దొరికితే.. షాక్‌ అవ్వడం తప్ప ఇంకా ఏం ఉంటుంది.. అలాంటి ఘటనే ఇప్పుడు బెంగళూరులో వెలుగు చూసింది.. అయితే అది ఇండియన్‌ కరెన్సీ కాదు.. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో.. చివరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది..

Read Also: Mumbai Road Accident: బాంద్రాలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి!

సాధారణంగా కరెన్సీ దొరికితేనే కాస్త ఆశ్చర్యపోతాం.. ఒకవేళ అలాంటిది ఏకంగా రూ.25 కోట్లు దొరికితే ఏం చేయాలో కూడా తెలియకుండా షాక్‌కు గురయ్యే పరిస్థితి.. అది కూడా చెత్త కుప్పలో..! ఇలాంటి ఘటనే బెంగళూరులో ఈ నెల 1వ తేదీన జరిగింది.. అయితే అది ఇండియన్ కరెన్సీ కాదు.. అమెరికా డాలర్లు. బెంగళూరు శివారులో సల్మాన్ షేక్ అనే వ్యక్తి రోజులాగే చెత్త ఏరుతుండగా 23 కట్టల అమెరికన్ డాలర్లు దొరికాయి. షాక్‌తిన్న అతడు.. తన మూటలో డాలర్ల కట్టలను వేసుకొని ఇంటికి వెళ్లిపోయాడు.. ఏం చేయాలో అర్థంకాక.. మూడు నాలుగు రోజుల పాటు ఆలోచించాడు.. చివరకు 5వ తేదీన ఆ కరెన్సీని తన యజమాని బప్పాకు అందజేశాడు.. ఆ తర్వాత ఈ వ్యవహారం స్థానిక సామాజిక కార్యకర్త కలీముల్లా వరకు వెళ్లింది.. ఇక, బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానందకు ఈ విషయాన్ని చేరవేశారు.. అనంతరం కేసు దర్యాప్తు చేయాల్సిందిగా హెబ్బాళ్ పోలీసులను ఆదేశించారు సీపీ.. అయితే, దొరికిన ఆ డాలర్ల విలువ రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. ఆ కరెన్సీ కట్టలపై కొన్ని రకాల రసాయనాలు పూసినట్లు కూడా గుర్తించారు. నల్లడాలర్ కుంభకోణానికి పాల్పడిన ముఠా ఈ కరెన్సీ నోట్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు.. అవి అసలు డాలర్లా లేక నకిలీవా? అనే అనుమానాలు కూడా కలగడంతో.. ఆ విషయాన్ని తేల్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ఈ వ్యవహారంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.