Leading News Portal in Telugu

Earthquake: ఢిల్లీలో 2.6 తీవ్రతతో భూకంపం..



Earthquake

Earthquake: ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. శనివారం ఢిల్లీలో 2.6 తీవ్రతతో మధ్యామ్నం 3.36 గంటలకు భూకంపం సంభవించింది. నార్త్ డిస్ట్రిక్ట్ లో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు.

ఇటీవల కాలంలో దేశరాజధాని ఢిల్లీలో పలుమార్లు భూమి కంపించింది. హిమాలయాలు, ముఖ్యంగా నేపాల్ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడల్లా ఢిల్లీలో ప్రకంపనలు ఏర్పడ్డాయి. కొద్ది రోజుల క్రితం నేపాల్ లోని పశ్చిమ ప్రాంతంలో 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ సమయంలో ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు వచ్చాయి.

Read Also: Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్‌ఫేక్ వివాదం.. వివరాలు ఇవ్వాలని మోటాను కోరిన పోలీసులు..

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సీస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం అధిక భూకంప ప్రమాద జోన్‌గా పరిగణించబడే జోన్ IVలో ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) వస్తాయి. జోన్ IV అనేది మోస్తరు నుండి అధిక స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించే అధిక సంభావ్యత గల ప్రాంతాన్ని సూచిస్తుంది.

ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ క్రమంగా ఉత్తరంగా కదులుతూ, ఆసియన్ టెక్టానిక్ ప్లేట్‌ని ముందుకు నెడుతుండటంతో దీని నుంచి విడుదలయ్యే శక్తి భూకంపాలుగా బయటకు వస్తోంది. గతంలో ఈ పరిణామాల వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎప్పుడో రోజు హిమాలయాలు, ఉత్తర భారతదేశం, నేపాల్ ప్రాంతాల్లో భారీ భూకంపాలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.