Leading News Portal in Telugu

Bihar: బీహార్‌లో బీజేపీ-ఆర్జేడీ సీట్ల సర్దుబాటు.. నితీష్‌కు ఎన్ని సీట్లంటే!



Dle

సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి ఆర్జేడీ అధినేత నితీష్‌కుమార్ వెళ్లారు. అంతేకాదు.. బీజేపీ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై బీజేపీ-ఆర్జేడీ మధ్య ఒప్పందాలు జరిగాయి.

లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా బీహార్‌ (Bihar)లో ఎన్డీయే (NDA) భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 14 సీట్లను బీజేపీ ఆఫర్ చేయగా, చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరస్‌కు-6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసింది. ఉపేంద్ర కుష్వాహ, మాంఠీ (హెచ్ఏఎం)కు చెరో సీటు ఇవ్వనుంది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.

ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల షేరింగ్ ఫార్ములాపై బీజేపీ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశమైంది. నిత్యానంద రాయ్, గిరిరాజ్ సింగ్, సుశీల్ మోడీ, సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, బీహార్ ఇన్‌చార్జి వినోద్ తావ్డే, రాధా మోహన్ సింగ్, నాగేంద్ర కుమార్, తారాకిషోర్ ప్రసాద్, నందకిషోర్ యాదవ్, ధర్మశీల గుప్తా, ప్రేమ్‌కుమార్, జానక్ రామ్, ప్రేమ్ రంజన్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జీపీలు ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నారు. ఈసారి 2024లో బీజేపీ, జేడీయూతో పాటు ఉపేంద్ర కుష్వాహ (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ), జితిన్ రామ్ మాంఝీ (హిందుస్థానీ అవామీ మోర్చా), లోక్‌ జనశక్తి పార్టీకి చెందిన రెండు వేర్వేరు పార్టీలు (పశుపతి పరస్, చిరాగ్ పాశ్వాన్) ఎన్డీయే భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే బీహార్‌లో 14 సీట్లతో పాటు జార్ఖండ్‌లోని ఛాత్ర సీటు, ఉత్తరప్రదేశ్‌లో ఫూల్‌పూర్ సీటును జేడీయూ కోరుతోందని.. దీనిపై చర్చలు జరుగుతున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే ఇటీవలే 195 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాని మోడీ వారణాసి నుంచి తిరిగి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా చుట్టేస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.