
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన దగ్గర నుంచి విరామం లేకుండా ప్రధాని మోడీ (PM Modi) దేశమంతా చుట్టేస్తు్న్నారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ.. కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇలా నెల రోజుల నుంచి తీరిక లేకుండా ప్రధాని మోడీ పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం మరో రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు.
గురువారం ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్లో పర్యటిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం ప్రధాని (PM Modi) మొదటిసారి కశ్మీర్ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం శ్రీనగర్లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శ్రీనగర్లోని బక్షి స్టేడియంలో జరగనున్న ‘వికసిత్ భారత్… వికసిత్ జమ్మూకశ్మీర్’ కార్యక్రమానికి మోడీ హాజరుకానున్నారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరుతుండటంతో మోడీ కశ్మీర్ పర్యటన రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.
సార్వత్రిక ఎన్నికలతో పాటే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా పర్యటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్సుంది. ఏప్రిల్లో పోలింగ్ ముగించుకుని మే నెలలో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.